సూపర్ స్టార్ రజినీకాంత్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు వ్యాఖ్యలతో రజినీకాంత్ వెనకడుగు వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రజినీకాంత్కు చెన్నైలొ రాఘవేంద్ర కళ్యాణ మండపం ఉంది. అయితే దీన్ని లాక్ డౌన్ నుంచి మూసివేశారు. కాగా ఈ కళ్యాణ మండపానికి అధికారులు పన్నులు కట్టమని చెప్పారు.
గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ తన ప్రాపర్టీకి రూ. 6.5 లక్షల రూపాయల ఆస్తి పన్ను విధించారని రజినీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన కళ్యాణ మండపం మార్చి 24వ తేదీ నుంచి మూసివేశామని తెలిపారు. అయినప్పటికీ చెన్నై కార్పోరేషన్ నోటీసులు ఇచ్చిందని అన్నారు. అయితే తమకు ఎలాంటి ఆదాయం లేదని అందుకే ఆస్తి పన్ను కట్టలేమని రజినీ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ దీనిపై మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. దీంతో ఈ కేసును విత్డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీ తరపు లాయర్ కోర్టును కోరారు. కాగా విషయం తెలుసుకున్న రజినీ ఫ్యాన్స్ మాత్రం దీనిపై సమర్ధిస్తున్నారు. ఆదాయం లేనందువలన కోర్టును ఆశ్రయించడంలో తప్పు లేదంటున్నారు. అయితే కోర్టులపై గౌరవం ఉంది కనుకనే విత్ డ్రా చేసుకోవడానికి సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు.