తెలుగు రాష్ట్రాలను వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో జనజీవనం స్తంభిచిపోయింది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
హైదరాబాద్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో అధికారులు మూడు రోజుల పాటు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఏపీలో పరిస్థితి అలాగే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతిపై అధికారులు సమీక్షలు చేస్తున్నారు. నివాస ప్రాంతాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని.. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించి…. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. మరోవైపు వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరికాసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక జారిస్తారని తెలుస్తోంది. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని.. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని చెబుతున్నారు.
బ్యారేజీ ఇన్ ఫ్లో 5,09,770, అవుట్ ఫ్లో 5,06,604 క్యూసెక్కులుగా ఉంది. చంద్రర్లపాడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చినలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో 6,46,747, అవుట్ ఫ్లో 5,34,933 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుకుంటోంది. 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో : 2.34 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో: 3.45లక్షల క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు కాగా.. ప్రస్తుతం: 884.60 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం: 213 టీఎంసీలకు చేరుకుంది.