ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. వైసీపీ నుంచి గెలిచిన ఈయన గత కొంత కాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. జగన్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇక రాజధానిపై మాట్లాడుతూ అమరావతే రాజధానిగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.
ఇక ఏపీలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందన్నారు. కాగా ఇప్పుడు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కొనసాగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై కేసుల విచారణ త్వరగా జరగాల్సిందిగా కోరడానికి బదులు విచారణ జరుపుతున్న వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడం తగదని హితవు పలికారు.
ఇటువంటి చర్యలవల్ల రాజ్యాంగ సంక్షోభం తలెత్తి రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమంటూ తాను విసిరిన సవాలుకు స్పందించకుండా తోగముడిచారని ఎంపీ అన్నారు. అమరావతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గత సంవత్సర కాలం నుంచి దళితులపై 30 దాడులు జరిగాయన్నారు. ఈ దాడులపై తన సొంత ఖర్చులతో న్యాయ పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.