దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొన్నటి దాకా సామాన్యులను తాకిన కరోనా ఇప్పుడు ప్రజాప్రతినిదులకు సోకింది. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడి చనిపోయారు. కాగా ఇప్పుడు ముఖ్యమంత్రికి కరోనా నిర్ధారణ అయ్యింది.
హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా పలు లక్షణాలు కనిపించడంతో ఆయన ఇవాళ కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ముందు జాగ్రత్తగా వారం రోజుల నుంచి తాను క్వారంటైన్లో ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు తాను అధికారిక నివాసంలో ఐసోలేషన్లో ఉన్నట్లు హిమాచల్ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు.
కాగా ఈ నెల 3 వ తేదీన సీఎం మనాలిలో కొందరిని కలిశారని, వారిలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఉన్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈయన మంత్రుల్లో ఇప్పటికే పలువురికి కరోనా సోకింది. 12 మంది దాకా ఎమ్మెల్యేల కరోనా బారిన పడ్డారు. సీఎం త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నేతలు, అభిమానులు కోరుకుంటున్నారు. దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.