కరోనా వచ్చాక ప్రపంచం మొత్తం మార్పు వచ్చేసింది. అంతకుముందు ఆప్యాయంగా కౌగిలింతలు, షేక్ హ్యాండ్ ఇవ్వడం సర్వసాధారణం అందరికీ.. కానీ ఇప్పుడు నమస్తేతోనే సరిపెట్టుకోవాలి. తాజాగా ఎన్నికల్లో కూడా పలు నిబంధనలు బయటకు వస్తున్నాయి.
ప్రస్తుతం బీహార్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. మూడు దశల్లో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సవాల్గా చెప్పొచ్చు. మామూలుగా అయితే అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అంతా చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోసం ప్రచారాల్లో పాల్గొనడం, పోలింగ్లో పాల్గొనడం మాములు విషయం కాదు. అందుకే ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని బీహార్ ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా కౌగిలింతలు, కరచాలనాలు ఉండకూడదని చెప్పింది.
రాజకీయ పార్టీలు ఈ మార్గదర్శకాలు పాటించాలని చెప్పింది. ప్రచారాల్లో పాల్గొనే వారు ఎవ్వరినీ ఆలింగనం చేసుకోకూడదు, దీంతో పాటు దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా చేయకూడదని చెప్పింది. దీంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లొచ్చు కానీ దూరంగా ఉండే మాట్లాడాలి. కరోనా వచ్చిన తర్వాత మనస్పూర్తిగా ప్రచారాలు చేయలేకపోతున్నామని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇక ఎక్కువ మంది గుమిగూడవద్దని ఎన్నికల సంఘం చెబుతోంది. దూరదర్శన్, ఆకాశవాణిలలో ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించింది.