ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ నుంచి సమాచారం అందింది. మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
ఈ నెలలోనే ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నదులు అన్నీ నిండుకుండలా మారిపోయాయి. ప్రజలు కూడా బాగా నష్టపోయారు. కాగా మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని తెలుస్తోంది. తర్వాత 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలుల వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇప్పటి నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్సకారులకు సూచనలు ఇస్తున్నారు. కోస్తాంద్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురువనుండగా.. కోస్తాంద్రలో భారీ వర్షాలు పడనున్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.