దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుకే ఏపీలో రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల లోక్సభ నియోజకవర్గాల వారీగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, ఎలాంటి కార్యచరణతో ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. కరోనా తగ్గిన తర్వాత రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన చెప్పారు. ప్రజలందరినీ కలిసి వారి కష్టాలు తీర్చేందుకు నడుం బిగిస్తానని చెప్పారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారికి గుణపాఠం చెబుతానన్నారు. అయితే చంద్రబాబు మాటలను ఆ పార్టీ నేతలు ఏ మేర విన్నారో కానీ రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం బాగా అర్థం చేసుకుంటున్నారు. ఎటు చూసినా పరిస్థితులు అనుకూలించక అందరూ పార్టీలు మారుతుంటే చంద్రబాబు ఇంకా ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.
ఒక వేళ చంద్రబాబు చెప్పినట్లు జమిలి ఎన్నికలు జరగొచ్చేమో. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా ఒకసారి కాదు రెండు సార్లు పర్యటించినా ప్రజలు మాత్రం ఆయన వైపు ఉండరని తెలుసుకోవాలి. ఎందుకంటే వై.ఎస్ జగన్ భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. స్వయాన ప్రధానమంత్రే జగన్ సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించారంటే అర్థం చేసుకోవచ్చు. పైగా నవరత్నాల పేరుతో జగన్ ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటన్నింటినీ ఆయన నెరవేరుస్తూ వచ్చారు.
పేద ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రం అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనుకంజ వేయడం లేదు. అంతేకాకుండా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించే విషయంలో టిడిపి అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాలన్నీ వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. పైగా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తలోదారి చూసుకుంటున్నారు. ఏ క్షణం ఏ నాయకుడు పార్టీని వీడతారో అన్న భయం పార్టీలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశలు పెట్టుకోవడం ఆయన అనుభవానికే వదిలేయాలని రాజకీయ విశ్లేషకుల మాట.