కరోనా కారణంగా వచ్చిన లాక్డౌన్లో ప్రజలు ఇళ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగానికే పరిమితమయ్యారు. ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పలువురు పొద్దుపోక చేస్తున్న పనులు కొంప ముంచుతున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనం..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో లూడోలో మోసం జరిగిందని ఓ యువతి కోర్టుకు వెళ్లింది. తాను తన ఫ్యామిలీతో కలిసి లూడో గేమ్ ఆడుతున్నట్లు తెలిపింది. అయితే తన తండ్రి తనకు సపోర్టు చేస్తానని చెప్పాడని.. అయితే అలా చేయకుండా తన పావులే చంపేశారని తెలిపింది. తన తండ్రే తనను మోసం చేయడం తనకు నచ్చడం లేదని తెలిపింది. అందుకే తన తండ్రిపై నమ్మకం పోయిందని చెప్పింది. దీంతో ఆయనతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని అనుకున్నట్లు పేర్కొంది.
ఈమె యువతి ఫిర్యాదుపై ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్ సరిత స్పందించి ఆ యువతికి నచ్చజెప్పి పంపారు. కాగా ఈ యువతి చిన్నపిల్లేం కాదు. ఈమె వయస్సు 24 సంవత్సరాలుగా తెలిసింది. అయితే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆట ఆటలా ఉండాలే తప్ప వ్యక్తిగత పగలు పెంచుకునే స్థాయికి వెళ్లకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.