ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇది ఇంతకు ముందు నుంచీ ఉన్న ప్రణాళికే అయినా ఈ సారి మాత్రం ఎన్నికలకు ముందు నుంచే కసరత్తులు మొదలు పెట్టినట్లు అర్థమవుతోంది. మరి ఏపీలో జగన్ ధాటికి ఎలా జరుగుతుందో చూడాలి.
దక్షిణాదిలో బలపడేందుకు బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవే అని మేధావులు అంటున్నారు. అయితే అది అంత ఈజీ పని కాదని చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసీపీ మంచి ఊపులోనే ఉంది. భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన జగన్ సర్కార్ అన్ని పనులు చకచకా చేసుకుంటూ పోతోంది. ఏపీ ఆర్థిక లోటులో ఉన్నా సంక్షేమ పథకాలకు మాత్రం లోటులేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వై.ఎస్ జగన్ ప్రజాభిమానాన్ని తట్టుకొని ఎలా ఎదుగుతుందో చూడాలి.
బీజేపీ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళుతున్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును అధ్యక్ష్యపదవిలో కూర్చోబెట్టింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిని ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసింది. పైగా సోమువీర్రాజు హైదరాబాద్ వెళ్లి చిరంజీవిని కలిశారు. పైగా జనసేన పొత్తుతో మరింత బలపడవచ్చని భావిస్తోంది బీజేపీ. ఇప్పుడు పురంధేశ్వరికి పదవి ఇవ్వడం కూడా ఆమె అనుభవంతో పార్టీకి మంచి జరుగుతుందని భావించి చేసిందని టాక్.
పలువురు కమ్మనేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారిని కూడా బీజేపీవైపు తిప్పుకోవచ్చని మేధావుల అభిప్రాయం. కాగా జీ.వీ.ఎల్ నరసింహారావు, రాం మాధవ్ లాంటి వాళ్లకు కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఉన్నందునే పదవులు రాలేదన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మంత్రి వర్గంలోకి వీళ్లు వస్తే అందరూ కలిసి ఏపీలో బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళతారని తెలుస్తోంది.