అన్నింటీలో అనుభవం ఉందని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఆ అనుభవమే శాపమైనట్లుంది. ఇన్నాళ్లూ పరిపాలన తెలియదని జగన్ను చంద్రబాబు కామెంట్ చేయడం తెలిసిందే. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలంతా యువకుడు జగన్ చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ఎన్నో సార్లు చెప్పారు.
అయితే ఇప్పుడు అంతా రివర్సైంది. చంద్రబాబే జగన్ను చూసి కాపీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైసీపీ చెబుతోంది. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు పార్టీ రాష్ట్ర కమిటీలు ప్రకటిస్తారని అంటున్నారు. అయితే ఈ సారి భిన్నంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడిని నియమించాలని ఆయన భావిస్తున్నారంట. అయితే అందులో ఏమీ వింత లేకపోయినా పక్కాగా కాపీ కొట్టినట్ల కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నిర్ణయం వై.ఎస్ జగన్ ఎప్పుడో తీసుకున్నారు.
2017లోనే జగన్ పార్లమెంటు నియోజకవర్గానికో అధ్యక్షుడిని నియమించారు. అధికారంలోకి వచ్చాక పార్లమెంటును జిల్లాగా చేస్తానని అప్పట్లోనే చెప్పారు. చెప్పిన విధంగానే జగన్ ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే జిల్లాల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటుచేయడంలో అన్ని విధాలా ఆలోచించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తోంది. సరిగ్గా ఇప్పుడే చంద్రబాబుకు జగన్ను కాపీ కొట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కమిటీలు ప్రకటిస్తే జిల్లాలో అధ్యక్షుడు ఉంటాడు.
త్వరలోనే ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో పార్టీలో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే జిల్లాలో పార్టీని నడిపించే నాయకులు కరువయ్యారన్న విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక జిల్లాలు ఎక్కువైతే ఒక్క అధ్యక్షుడితో ఏమీ చేయలేమని.. అందుకే ఇప్పుడే పార్లమెంటుకో అధ్యక్షుడిని పెడితే అయ్యేదేదో అవుతుందని పార్టీ సీనియర్లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా నేతలు చేజారిపోకుండా ప్రాముఖ్యత ఇచ్చినట్లు చెప్పుకోవచ్చని డిస్కస్ చేసుకుంటున్నారట. ఏదిఏమైనా ఎందులోనూ చంద్రబాబుకు తగిన నాయకుడు జగన్ కాదని అంటున్న టిడిపి నేతలకు.. ఇప్పుడు జగన్ను చూసి పార్లమెంటుకో అధ్యక్షుడిని నియమిస్తున్న చంద్రబాబును చూస్తే ఎవరి అనుభవం ఏంటో ఇట్టే అర్థమవుతోందని రాజకీయవర్గాల్లో టాక్.