ఆంద్రప్రదేశ్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైన సీఎం జగన్ ఇప్పుడు రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీఇచ్చిన మేరకు రైతుల పొలాలకు నీళ్లు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఏపీలో చిన్న సన్నకారు రైతుల పొలాల్లో బోర్లు వేయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ పథకానికి వైఎస్సార్ జలకళ పేరును పెట్టారు. వచ్చే నాలుగేళ్లలో దాదాపుగా 2 లక్షల బోర్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు ప్రధానంగా కావాల్సింది నీరు. అయితే బోర్లు లేనిదే పొలాలకు నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. కాగా బోర్లే వేయాలంటే అందుకు చాలా మంది రైతులు ముందుకు రారు. ఎందుకంటే ఒకవేళ బోర్ వేయించినా నీల్లు పడతాయో లేదో అన్న ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంటుంది.
ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న రైతుల కోసమే ప్రభుత్వం బోర్లు వేయాలని నిర్ణయించింది. ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్సార్ జళకళ పేరుతో దీన్ని అమలు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ఇది ప్రారంభోత్సవం కానుంది. ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రిగ్గు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన సీఎం జగన్ ఈ వాహనాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది.
బోర్లు వేయించుకోవాలని అనుకుంటున్న రైతులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం రైతుల మెట్ట పొలాల్లో బోర్లు వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్య అయిన నీటి విషయంలో జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి.