పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీరాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తుల్లో పరిటాల రవి ఒకరు. ఆయన మరణం తర్వాత కుటుంబం రాజకీయంగా చతికిల పడిందని చెప్పొచ్చు. తెలుగుదేశం ప్రభుత్వంలో పరిటాల సునీత మంత్రిగా పనిచేశారన చెప్పుకోవడమే తప్ప ఆయన రాజకీయ వారసుడిగా పరిటాల శ్రీరాం ఇంకా సెట్ అవ్వలేదన్న టాక్ నడుస్తోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014లో పరిటాల సునీత మంత్రివర్గంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో క్యాడర్ను బలపరచలేదన్న వాదన ఎక్కువగా ఉంది. పరిటాల వారసుడిగా శ్రీరాం ముందుండి కార్యకర్తలు, అభిమానులను నడిపించాల్సింది పోయి ముట్టీముట్టనట్లుగా ఉంటున్నారన్న అపవాద మూటగట్టుకున్నారు. ఏదో ఓ కేసులో ఇరుక్కున్న శ్రీరామ్ అప్పటి నుంచి నియోజకవర్గంలో కూడా అంతగా పర్యటించడం లేదని అక్కడి పబ్లిక్ డిస్కస్ చేసుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీరామ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి కారణం జగన్ అభిమానం ఒక కారణమైతే, ఆయన సొంతంగా చేసుకున్న తప్పిదాలు కూడా కారణమని నేతలే చెబుతారు. తండ్రికి తగ్గ తనయుడిలా ఉండాల్సిన పరిటాల శ్రీరామ్ అలా వ్యవహరించడం లేదన్న టాక్ సొంత జిల్లాతో పాటు నియోజకవర్గంలో ఉంది. అయితే గిట్టని వాళ్ల చెబుతున్న మాటలంటూ పరిటాల కుటుంబం దీన్ని కొట్టి పారేసినప్పటికీ జనంలో ఉండే వారే నాయకులవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన పరిటాల శ్రీరామ్ ఏ మేరకు జనంలో ఉన్నారో ఆలోచించుకోవాలని రాజకీయ విశ్లేషకుల మాట. ఓడినా నెగ్గినా జనంలో ఉండే వాడే ఎప్పటికైనా నాయకుడిగా ఎదుగుతాడని చెబుతారు. అయితే పేరున్న కుటుంబంలో పుట్టిన వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పరిటాల శ్రీరామ్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.