కొబ్బరి చెట్ల గురించి ప్రజలకు వివరించేందుకు ఏకంగా కొబ్బరి చెట్టునే ఎక్కారు ఓ మంత్రి. ఈ ఘటన మనదేశంలో కాదు శ్రీలంకలో జరిగింది. కొబ్బరి చెట్ల ప్రాధాన్యత ప్రజలతో పాటు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వినూత్న రీతిలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు.
మీడియాతో మాట్లాడాలని అనుకున్న ఆయన మామూలుగా మాట్లాడితే ఎవ్వరికీ అర్థం కాదనుకున్నారు. శ్రీలంక దేశానికి చెందిన మంత్రి అరుంధికా ఫెర్నాండో ఈ విధంగా చేశారు. శ్రీలంకలో కొబ్బరి చెట్లపైనే ఎక్కువగా ప్రజలు ఆధారపడతారు. అయితే ఇప్పుడు అక్కడ కొబ్బరి చెట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా కొబ్బరి చెట్ల పెంపకం గురించి చెప్పాలని ఇలా చేసినట్లు చెప్పారు. దేశంలో పారిశ్రామిక అవసరాలకు కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.. అందుకే శ్రీలంలోకి ప్రతి భూమిని కొబ్బరి సాగుకోసమే వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కొబ్బరి వల్ల విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందన్నారు. అందుకే కొబ్బరి ఉత్పత్తులను పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలో కొబ్బరి కాయల కొరత ఉన్నప్పటికీ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వినూత్న రీతిలో కొబ్బరి చెట్టు ఎక్కి ప్రజలను చైతన్య పరచాలని చూస్తున్న మంత్రి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. పలువురు ఆయన్ను ప్రశంసిస్తున్నారు.