పేద ప్రజల సంక్షేమం కోసం అధికారం చేపట్టామని చెప్పుకుంటున్న వై.ఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతులకు అన్ని విధాలా మేలు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులకు సంబంధించిన రుసుంను రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాలు చేయాల్సిందా చేస్తున్నా రైతులు మాత్రం జగన్పైనే నమ్మకం పెట్టుకున్నారు.
రైతులకు ఇబ్బందులు రాకుండా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఏ విధంగా విమర్శలు చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏ విధమైన ఇబ్బందులకు గురయ్యారో చరిత్ర చెబుతోంది. కరెంటు బిల్లులు కట్టలేమని అప్పట్లో రైతులు ఎలా ఆందోళనలు చేశారో గుర్తు చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశాజనకంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది.
ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకం కోసం 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమైంది. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో తొలిదశలో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ ప్రాసెస్ చేస్తోంది. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరిస్తోంది. టెండర్ల ప్రక్రియపై సామాన్యుడికి కూడా అవగాహన వచ్చేలా సమాచారం ఉంచింది. టెండర్ల డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు కూడా పంపింది. ఈ న్యాయసమీక్ష పూర్తయిన తర్వాతనే టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం అనుకుంటోంది. మొత్తానికి రైతుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్.. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటినుంచే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.