ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖకు ఊహించని రీతిలో గౌరవం దక్కుతోంది. మొన్నటికి మొన్న స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో దేశంలోనే విశాఖ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దేశంలో విశాఖ 9వ స్థానంలో నిలిచిన విశాఖ ఇప్పుడు మరో ఘనత సాధించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నస్వచ్చ భారత్ మిషన్ 2020 పోటీలో మొదటి పది జిల్లాల్లో విశాఖ చోటు దక్కించుకుంది. ఇండియాలో మొత్తం పది జిల్లాలు స్వచ్చభారత్ మిషన్లో చోటు దక్కించుకుంటే అందులే దక్షిణాది రాష్ట్రాలలో విశాఖ ఒక్కటి మాత్రమే నిలిచింది. సౌత్లో ఎన్నో జిల్లాలు ఉన్నా విశాఖ జిల్లా మాత్రమే పోటీలో ఉండి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఏపీకి గర్వ కారణం.
జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలు ఒక క్లస్టర్గా ఏర్పడి విశాఖ ఈ పోటీలో నిలిచింది. ఇందులో ప్రధానంగా ప్రజల భాగస్వామ్యం చాలా ఉంది. ఎందుకంటే స్వచ్చత అనేది ఏ ఒక్కరూ చేసేది కాదు. ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛత అనేది సాధ్యమవుతుంది. స్వచ్చభారత్ మిషన్ అవార్డులను ప్రజల వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన ఏ విధంగా ఉందన్నదానిపై నిర్వహిస్తారు. స్వచ్చ భారత్ మిషన్ ఫలితాలు మరో పది రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఈ పోటీలకు సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే వివరాలు సమర్పించారు. మరి స్వచ్చ సర్వేక్షణ్లో 9వ స్థానంలో నిలిచిన విశాఖ స్వచ్చ భారత్ మిషన్ అవార్డుల్లో ఏ స్థానం దక్కించుకుంటుందో వేచి చూడాలి.