పార్లమెంటులో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన దానిపై ఆయన ఎంపీలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనపై సూచనలు చేశారు.
ప్రధానంగా కరోనా వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ఆర్థిక కష్టాలను కాస్త ఎక్కువే ఎదుర్కొంటోందని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తరుపున రావాల్సిన జీఎస్టీబకాయిలు, ఇతర నిధులపై కూడా ఫోకస్ పెట్టాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధుల అంశాలపై బీఏసీ సమావేశంలో కోరినట్లు లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి జగన్కు తెలిపారు. కాగా ఎంపీలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో భేటి అయ్యారు. చిత్తూరు, అరకు, కాకినాడ ఎంపీలకు కరోనా రావడంతో వీళ్లు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడం లేదు. మిగిలిన వారంతా సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు.
లోక్సభా పక్షనేత మిథున్రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బెల్లాన చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగయ్య, సత్యవతి, భరత్, పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, ఎన్వీవీ సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి తదితులు హాజరయ్యారు. ఇక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు వైసీపీ మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్కు టీఆర్ఎస్ దూరంగా ఉంది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ ఎంపీ సాయి రెడ్డి.. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్కే మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.