అక్రమార్కులు ఏకంగా దేవున్నే టార్గెట్ చేశారు. రామజన్మ భూమి భూమి ట్రస్టుకు సంబంధించిన రూ. 6 లక్షల రూపాయలను కాజేశారు. విషయం బయటకు తెలియడంతో ఒక్కసారిగా ట్రస్టు అప్రమత్తమైంది.
రామ జన్మ భూమి ట్రస్టుకు సంబంధించిన ఓ చెక్కు విషయంలో బ్యాంకు సిబ్బంది ట్రస్టుకు ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చెక్కుల సీరియల్ నంబర్ల ద్వారా దుండగులు రెండు చెక్కుల ద్వారా రూ. 6 లక్షల సొమ్మను ఖాజేసినట్లు తెలుస్తోంది. ట్రస్టు కార్యదర్శి, ఇతర సభ్యుల సంతకాలు ఫోర్జరీ ద్వారా ఇది జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఘటనను రామజన్మ భూమి ట్రస్టు తీవ్రంగా పరిగణిస్తోందని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఘటనపై అయోధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో బ్యాంకు అధికారుల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రా చేసిన డబ్బులు పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి వెళ్లినట్లు గుర్తించారు. చెక్కుల సీరియల్ నంబర్లు తెలుసుకొని ప్లాన్ ప్రకారంగా ఇలా చేశారని అంచనా వేస్తున్నారు. అయితే ఒరిజినల్ చెక్కులు మాత్రం ట్రస్టు వద్దే ఉన్నట్లు తెలిసింది. ఇటీవలె అయెధ్యలో రామ ఆలయం కోసం శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.
ఎంతో మంది రామ ఆలయ నిర్మాణం కోసం విరాళులు కూడా పంపించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.