సుధీర్ఘ కాలం నుండి పార్టీని అంటిపెట్టుకున్న వారి ఆశలు నెరవేరే రోజులొస్తున్నాయి. రాజకీయాల్లో ఎదురవుతున్న పలు పరిస్థితుల వల్ల తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనుకున్న నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో కొత్త పదవులు దక్కనుండటంతో అధికార పార్టీ నేతలు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు పదవులు దక్కే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడటంతో ఎవ్వరి మాట ఎలా ఉన్నా ఏపీలో అధికార పార్టీ నేతల్లో మాత్రం నిరాశే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కాకపోయినా మరో నెలలో నైనా స్థానిక సంస్థలు జరుపుదామనుకుంటే కరోనా వచ్చి ఉండే. ఈ పరిస్థితుల్లో ఇప్పట్లో స్థానిక సంస్థలు నిర్వహించే ఆలోచన లేదు. పైగా ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను జనవరి వరకు పొడగించింది.
ఈ పరిస్థితుల్లో నిరాశతోనే ఉండాల్సిన వైసీపీ నేతలు మాత్రం సంతోషంగా ప్లాన్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే కొత్త జిల్లాల కోసం ప్రభుత్వం కసరత్తులు చేస్తుండటమే కారణం. ఇప్పటికే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఓ కమిటీను కూడా వేసింది. మరో ఆరు నెలల్లో జిల్లాల ప్రక్రియ పూర్తవ్వనుంది. ఇక అరకు పార్లమెంటు స్థానంలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రెండు జిల్లాలు చేయాలనుకోవడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరుతుంది.
ఆరు నెలల్లో కొత్త జిల్లాలు వస్తాయి. ఆ తర్వాత ప్రత్యేకాధికారుల పాలన ముగిసిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయి. దీంతో వైసీపీ నేతలకు అడిగినవారికి అడిగినన్ని పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఎంపీటీలు, జెడ్పీటీసీలు ఎవరన్న దానిపై క్షేత్ర స్థాయిలో కూడా స్పష్టత ఉంది. ఇక కొత్తగా జిల్లాలు వస్తే జెడ్పీ చైర్మన్లు వస్తారు. పార్టీలో కూడా అవకాశం కల్పించేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో పార్టీ నమ్ముకున్న వారితో పాటు జగన్ అభివృద్ధి కోసం పార్టీలు మారి పదవులు దక్కుతాయని ఆశిస్తున్న వారు సైతం రానున్న ఆరు నెలల కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఇప్పటి నుంచే ఆశగా ఉన్నారు.