వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఇలా రాద్దాంతం చేస్తున్నాయన్నారు. వినాయక చవితి పండుగపై, ప్రతిపక్షాలు, ఎంపీ రఘురామకృష్ణ రాజు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజల బాగుకోసమే ప్రభుత్వం ఉత్సవాలు ఇంట్లోనే జరుపుకోవాలని సూచించిందని మంత్రి తెలిపారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేయడం మంచిది కాదన్నారు. ఇక ఎంపీ రఘురామకృష్ణంరాజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. ఆయన సొంత ఊరు వదిలి ఢిల్లీలో ఉన్నారన్నారు.