బాలివుడ్ నటుడు సుశాంత్ రాజ్పూత్ కేసు ఎట్టకేలకు సీబీఐ వద్దకు చేరింది. ఈమేరకు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది.
సుశాంత్ సింగ్ మృతిపైన మొదటి నుంచి అనుమానాలు వస్తూనే ఉన్నాయి. సుశాంత్ మృతి వెనుక అసలేం జరిగింది అన్న దానిపై భిన్న వాదనలు బయటకు వచ్చాయి. చివరకు మలుపులు తిరిగిన ఈ కేసు సీబీఐ చేతిలో పడింది. సుశాంత్ తండ్రి తన కుమారుడి మరణంపై ముందు నుంచీ అనుమానాలు ఉన్నాయని బీహార్ ప్రభుత్వాన్ని కోరారు.
సుశాంత్ తండ్రి విజ్ఞప్తి మేరకు బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇచ్చేందుకు ఓకే చెప్పింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరింది. కాగా ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. బీహార్ ఎస్పీ ఈ కేసు విచారణలో భాగంగా మహారాష్ట్ర వెళితే ముంబై పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీహార్లో సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సరైనదే అని సుప్రీం స్పష్టం చేసింది. కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరే అర్హత బీహార్ ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ మేరకు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐకి కొత్త కేసు ఫైల్ చేసేందుకు అవకాశం కూడా సుప్రీంకోర్టు కల్పించింది.