ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. ఆధారాలుంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరుపున న్యాయవాదికి ఆదేశించింది. దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిటిషన్ తరుపు న్యాయవాది వాదిస్తూ ప్రతి జడ్జికి సంబంధించిన కదలికలను పోలీసులతో మానిటరింగ్ చేస్తున్నారన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ హైకోర్టు పిటిషనర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేస్తానని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరోవైపు ఈ పిటిషన్పై ఎందుకు విచారణ జరపకూడదని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎల్లుండిలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలన్నారు. వాదనలు ఉంటే ఎల్లుండి వినిపించాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదికి తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లకు కూడా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎల్లుండి విచారణ జరగనుంది.