ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పటి నుంచి గవర్నర్ నరసింహన్ ది డిఫరెంట్ స్టయిల్. ఏపీ నుంచి తెలంగాణ వేరు పడిన తర్వాత కూడా.. మూడేళ్లుగా ఆయనే.. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్నారంటనే.. నరసింహన్ సత్తా ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. సింగిల్ హాండ్ తో 2 రాష్ట్రాల వ్యవహారాల్ని ఢిల్లీ స్థాయిలో చక్కబెడుతున్న గవర్నర్ నరసింహన్.. రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. కాస్త ఉద్వేగానికి లోనయిన గవర్నర్.. గతాన్ని గుర్తు చేసుకుంటూ.. తెలుగు నేలతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. తను చదువుకున్నదీ.. మొట్టమొదట ఉద్యోగం చేసింది తెలుగు నేలపైనే అని చెప్పిన గవర్నర్ నరసింహన్.. చావు అంచులవరకూ వెళ్లొచ్చి.. మళ్లీ బతికింది కూడా తెలుగు గడ్డపైనే అన్నారు. సరిగ్గా 46 ఏళ్ల క్రితం ఉగాది వేడుకల సమయంలోనే.. ఓ ప్రమాదానికి గురైన తాను.. కోమాలోకి వెళ్లిపోయినట్టు చెప్పారు. అప్పుడు కర్నూలు గడ్డపై తిరిగి పునర్జన్మ అందుకున్నాననీ.. అందుకే ఉగాది అంటే తన జీవితంలో చాలా ప్రాధాన్యత ఉందనీ చెప్పుకొచ్చారు.
2 రాష్ట్రాల ప్రజలు ఇలాగే కలిసి మెలిసి మరింత సమృద్ధి చెందాలని కోరుకున్న గవర్నర్.. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు.