ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. రాజ్యాంగం, చట్టం ప్రకారం నడుచుకోవడం గురించి మాత్రమే కాకుండా మూడు రాజధానుల గురించి కూడా సంకల్పాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన గాయం మళ్లీ మళ్లీ కాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాల్సి ఉందని దానికి వికేంద్రీకరణే సరైన విధానం అని తేల్చి చెప్పారు. అందుకే సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామన్నారు.
త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తామని స్పష్టం చేశారు. తమ పాలనలో రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతున్నామని జగన్ ప్రకటించారు. తాము చేపట్టే పథకాలన్నీ ప్రజల్ని పేదరిక నుంచి బయటపడేసేందుకేననన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటామని ప్రకటించారు. భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారి, కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా ఇస్తుందని అనుకుంటున్నామని అప్పటి వరకూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామన్నారు.