పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన గెజిట్ ప్రకటనలు, చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో ను పొడగించింది.
జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఏ.వి శేషసాయి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్బంగా మూడు రాజధానులు విభజన చట్టానికి విరుధ్ధమని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలో కేవలం ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందన్నారు.
ప్రభుత్వ తరపున న్యాయవాది రాకేష్ త్రివేది మాట్లాడుతూ ప్రభుత్వానికి విధులు నిర్వర్తించాల్సిన అవసరముందని వాదించారు. కేసును వాయిదా వేయండి కానీ.. స్టేటస్ కో పొడిగించవద్దని ఆయన హైకోర్టును కోరారు. స్టేటస్ కోతో క్యాంప్ కార్యాలయం తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. స్టేటస్ కో ఉత్తర్వులతో చట్టాలను అమలు చేసే అవకాశం లేకుండా పోయిందని వాదించారు.
ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టాన్ని ఉల్లంఘించినందునే తాము స్టేటస్ కో అడిగామని, స్టేటస్ కో ఎత్తేయడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.