రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పురోగతులు, జరుగుతున్న పనులు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కరోనా ఉన్నా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు కరోనా ఉన్నా కొనసాగించామని అధికారులు సీఎంకు తెలిపారు. స్పిల్ వే పిల్లర్స్ ఈ ప్రభుత్వం వచ్చే నాటికి సగటు ఎత్తు 28 మీటర్లయితే, ఇప్పుడు 51 మీటర్లుగా ఉందన్నారు. సెప్టెంబర్ 15 కంతా స్పిల్ వే పనులు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. వర్షాలు పడుతున్నప్పటికీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు.
ఇక పునరావాసం గురించి మాట్లాడిన సీఎం.. నాణ్యతపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్ 2, వెలిగొండ టన్నెల్ 1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశాధార నాగావళి అనుసంధానం, వంశాధార ప్రాజెక్టు 2లో ఫేజ్ 2 పనుల వివరాలు జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా అవసరమైన ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చెయ్యాలని అధికారులను జగన్ ఆదేశించారు. గండికోట.. పైడిపాలెం లిఫ్ట్ అప్గ్రేడేషన్ పనులు, రాజోలి, జొలదరాశి ప్రాజెక్టుల పనులు తొందరగా ప్రారంభించాలన్నారు.