ఏపీలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మహిళలకు అండగా ఉండేందుకు జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధికానీ, సంక్షేమ పథకాలు కానీ చంద్రబాబు చేయలేదన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి టిడిపి ఓర్వలేకపోతుందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఒంటరి మహిళలకు ఆర్థికంగా సహాయం చేయడం జగన్కే దక్కుతుందన్నారు. జగన్ అభివృద్ధి చూసి ఓర్వలేకనే ప్రతి విషయంలో కోర్టులకు వెళుతున్నారన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చిన చంద్రబాబు.. సంపాదన కోసమే వ్యవస్థను నాశనం చేశాడన్నారు. చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేసి మరోసారి కుప్పం నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.