విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో హాస్పిటల్ యజమాని రమేష్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
అగ్నిప్రమాద ఘటనలో పది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కోవిడ్ కేర్ సెంటర్లో ఎలాంటి నిబంధనలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హోటల్లో అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే బయటకు వెళ్లడానికి రెండో ద్వారం కూడా లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు తేల్చారు.
ఈ కేసులో హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇంచార్జి, ఆస్పత్రి జీఎం సుదర్శన్, కో ఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేష్లకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్తో సహా రమేష్ హాస్పిటల్స్లో తనిఖీలు నిర్వహించాయి.
కాగా నిబంధనల ప్రకారం భవన నిర్మాణం చేపట్టకపోవడం, ఎక్కువ మంది పేషెంట్లను చేర్చుకోవడంతో పాటు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని తనిఖీ బృందాలు గుర్తించాయి. ఇదిలాఉంటే ఆసుపత్రి యజమాని రమేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అధికారులు పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేశారు.