ఆయన అనుకుంటున్నదొకటి అవుతున్నదొకటి. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏదీ అనుకూలంగా లేదు. ఆయనొకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది.
మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం ఒక్కటే అభివృద్ధి చెందుతుంది. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండట వలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని ప్రభుత్వం భావించింది.
రాష్ట్రంలో వేసిన కమిటీలు కూడా ఇదే తరహాలో నివేదికలు అందజేశాయి. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ కూడా ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు మాత్రం ఇప్పటికీ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా గవర్నర్ నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. మూడు రాజధానులు ఉండకూడదని చెబుతున్నారు. ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. అయితే ఇప్పుడు కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో చెప్పింది.
కాగా రాజధాని విషయంలో అధికార పార్టీ రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని చంద్రబాబు చెప్పిన మాటలపై రాష్ట్ర మంతా చర్చ జరిగింది. ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందని అనుకున్నారు. ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల గడువు పూర్తవుతున్న కొద్దీ చంద్రబాబు ఆయన తెలివితేటలతో ఏం చేస్తారో అన్న టెన్షన్ నడిచింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై తమ పరిధిలోనికి రాదని చెప్పడంతో చంద్రబాబు అండ్ టీంకు ఏం చేయాలో అర్థం కాలేదని తెలుస్తోంది.
అయితే ఇప్పటికీ చంద్రబాబు ఈ అంశంలో కేంద్రం ఇచ్చిన సమాధానంపై మళ్లీ ఏదో ఒకటి మాట్లాడతారని పలువురు చర్చించుకుంటున్నారు. ఎలాగూ తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఆయనకు మద్దతుగానే ఉన్నారు. కాబట్టి వీళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబు రాజకీయం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి చూద్దాం డెడ్లైన్ విసిరిన చంద్రబాబు ఏం చేయబోతున్నారో.