ఏపీలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. నేడు ఇద్దరు కొత్త మంత్రలు ప్రమాణ స్వీకారం చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిల స్థానంలో కొత్త మంత్రులు రాజ్భవన్లో ప్రమాణం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ముందుగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రమాణం చేయగా.. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, తదితరులు హాజరయ్యారు.
వై.ఎస్ జగన్ క్యాబినెట్లో ఇప్పటివరకు 23 మంది మంత్రులున్నారు. కొత్త మంత్రులు చేరడంతో ఈ సంఖ్య 25కి చేరింది. ఇద్దరు మంత్రులు బిసి సామాజిక వర్గానికి సంబంధించిన వారినే జగన్ ఎంపిక చేశారు. అంతకుముందు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ వై.ఎస్ జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గతంలో బలహీన వర్గాలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడేవని… వైఎస్ జగన్ పాలనలో బిసిలకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని జగన్ తన కుటుంబ సభ్యులుగా చేసుకున్నారన్నారు.