బిగ్ బి అమితాబ్ బచ్చన్ మారిపోయారా. ఆయన కొత్త మాటలు మాట్లాడుతున్నారా. అవును తాజాగా ఆయన మాటతీరు చూస్తే ఇది నిజమనిపిస్తోంది. కోవిడ్ -19 సోకిన అనంతరం ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయని చెబుతున్నారు అమితాబ్.
తాను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. అంతకంటే మీకేం ఇవ్వగలనన్నారు. ముంబైలోని ఆసుపత్రిలో అమితాబ్ తో పాటు అభిషేక్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కోవిడ్ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. వీరంతా ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. అయితే ఈ ఖాలీ సమయంలో తన మదిలో మదులుతున్న ఆలోచనలను ఆయన సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
మనలో ఎన్నో ఆలోచనలు ఉన్నా మనం ఉన్న బిజీ లైఫ్ లో వేటి గురించి ఆలోచించడం లేదని అమితాబ్ అభిప్రాయపడ్డారు. మనం ఏమైపోతున్నామో ఆలోచించే తీరిక ఉండేది కాదని.. కరోనా సమయంలో కాస్త సమయం దొరికిందన్నారు. ఇలాంటి సమయంలోనే ఆలోచనలు మన మెడడులోకి వేగంగా ప్రవేశిస్తుంటాయన్నారు. కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞానులపై గౌరవం పెరుగుతుందన్నారు. చివరగా అంతా సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నా అన్నారు.
అమితాబ్ మనసులోని మాటలు బహిర్గతం చేసాక విపత్కర పరిస్థితుల్లో ఆయన ఎంతలా ఆలోచిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన కోరుకున్నట్లుగానే అంతా సాధారణ స్థితికి రావాలని, వస్తుందని ఆయన అభిమానులు అండగా నిలుస్తున్నారు. త్వరగా కుటుంబమంతా కోలుకుని రావాలని కోరుతున్నారు.