కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా అందరూ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఇదిలా ఉంటే 71 ఏళ్ల వయసున్న వెంకయ్య నాయడు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ‘గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు గారికి కొవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు తెలిసి చాలా బాధనిపించింది. హోమ్ ఐసొలేషన్ లో ఉన్న వెంకయ్య నాయుడు గారు సత్వరమే కోలుకొని రాజ్యంగ బాధ్యతలు యధావిధిగా నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను. దేశంలో కరోనా ఉత్పాతం మొదలైనప్పటి నుంచి ఉపరాష్ట్రపతిగా ప్రజలకు ధైర్యవచనాలు చెప్పారు. ఎంతో దృఢ చిత్తంగల శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ చిన్నపాటి అవాంతరాన్ని సునాయాసంగా అధిగమిస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను’. అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు హాజరైన విషయం తెలిసిందే.
శ్రీ వెంకయ్య నాయుడు గారు త్వరగా కోలుకోవాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/OI59HY9wVp
— JanaSena Party (@JanaSenaParty) September 30, 2020