కరోనా పుణ్యమాని టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడడంతో.. పెళ్లిళ్లు చేసుకుంటూ ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు నిఖిల్, రానాలు పెళ్లి పీటలెక్కారు. ఇక శర్వానంద్ కూడా పప్పన్నం పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం.. బుల్లితెర ప్రేక్షకులను తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటోన్న.. ప్రదీప్ మాచిరాజు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తెను ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. మరో మూడు నెలల్లో వివాహం జరగనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ప్రదీప్ తన వివాహం విషయమై స్వయంగా ఓ ప్రకటన చేయనున్నాడని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.