ప్రస్తుతం ఓటీటీకి ఆదరణ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా బడా సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడం కూడా వీటికి ఆదరణ పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఇక ఇటీవల బడా స్టార్లు కూడా వెబ్ సిరీస్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా ఓ భారీ వెబ్ సిరీస్ ను రూపొందించనుందని సమాచారం. ఇందులో రానా, శృతిహాసన్ జంటగా నటించనున్నారు. 10 ఎపిసోడ్లుగా రూపొందించనున్న ఈ వెబ్ సిరీస్ ను దేశవ్యాప్తంగా ఏకంగా పది భాషల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. రానా, శృతిహాసన్ లకు తెలుగుతోపాటు హిందీ, తమిళ ఇండస్ట్రీలో గతంలో నటించిన అనుభవం ఉండడంతో వీరిద్దరిని ఇందుకోసం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్ డిజిటల్ తెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.