రాష్ట్రాన్ని పర్యాటకంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన పర్యాటక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏపీ టూరిజం ఆన్లైన్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ ను పోర్టల్ను సీఎం ప్రారంభించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న దానిపై చర్చించారు. రాష్ట్రంలో 12 నుంచి 14 ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు. అరకులో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రాయలసీమ, ఆంధ్రలో సుప్రసిద్ధ ఆలయాలు ఉన్న విషయం తెలిసిందే. శ్రీశైలం, ఒంటిమిట్ట, తిరుమల, శ్రీకాళహస్తితో పాటు పర్యాటక ప్రాంతాలు విశాఖ బీచ్, అరకుతో పాటు చాలా ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రంలో పర్యాటకంగా అవసరమైన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
ఇందులో భాగంగానే సమావేశంలో ఏఏ దానికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలన్న దానిపై చర్చించారు. రాజస్థాన్కు ధీటుగా ఇక్కడి ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని సీఎం అన్నారు. ఇప్పటికే సగంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగన్ చెప్పారు.