జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతులను ఆయన పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ కు స్వాగతం చెప్పేందుకు గూడూరు రహదారి పోటుపాళెం సర్కిల్ వద్దకు అభిమానులు నాయకులు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో ఆప్రాంతంలో సందడిగా మారింది.
ఈ సందర్బంగా వైసీపీ నేతలపై పవన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పర్యటించి.. రైతులకు భరోసా కల్పించకూడదా అని ప్రశ్నించారు. రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన నన్ను అడ్డుకోవడం సరికాదన్నారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే రైతులను పరామర్శించే నా పర్యటన అడ్డుకోవాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని.. కొంతమంది పోలీసులు వైసీపీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమయిందని మండిపడ్డారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కాగా పవన్ కళ్యాణ్ ఈరోజు, రేపు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు నాయుడుపేట, గూడూరు, మనుబోలు, రేపు రాపూరు, వెంకటగిరిలలో పర్యటనలు సాగనున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పవన్ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.