కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళన కొందరిలో నెలకొంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే దుష్పలితాలపై ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. దీనిపైనే వ్యాక్సిన్ తయారీకంపెనీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల కరోనా ట్రయల్స్లో పాల్గొని అనారోగ్యం పాలైనందుకు తను రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ ఓ చెన్నైకి చెందిన వ్యక్తి ఒకరు సీరంకు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని వ్యాక్సిన్ సంస్థలు కోరుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్యే తమ అనారోగ్యం కారణమంటూ దాఖలయ్యే కేసుల నుంచి టీకా తయారీ దారులను ప్రభుత్వమే రక్షించాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా అభిప్రాయపడ్డారు. కార్నెగీ ఇండియా ఏర్పాటు చేసిన గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్-2020లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు, కెసులు వెలుగు చూసిన సందర్భాల్లో ప్రభుత్వం కల్సించుకుని టీకా తయారీ దారులకు రక్షణ కల్పించాలన్నారు.
ఈ సైడ్ ఎఫెక్ట్స్కు కంపెనీ బాధ్యత వహించాల్సిన అవసరం లేని చట్టాలను తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిరాధార ఆరోపణల కారణంగా ప్రజల్లో అనవసర ఆందోళన పెరగటమే కాకుండా.. టకా తయారీ దారులు దృష్టి టీకా పరిశోధన నుంచి మరలిపోతుందన్నారు. వారు దివాళ తీసే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరి వీటిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ పై అనుమానాలు తీరాలి.