‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది నటి సమంత. అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించి… నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోని దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించిన సామ్.. అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకొని తెలుగువారి కోడలిగా మారింది. ఇక వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోందీ చిన్నది. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ‘మీ జీవితంలో ఏ విషయంలో ఎక్కువగా కృతజ్ఞతా భావంతో ఉన్నారు?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఉదయం నిద్రలేవడంతోనే ఆ రోజుకు నేను కృతజ్ఞత చెబుతా. నేను జీవించే ప్రతి క్షణానికి కృతజ్ఞత భావంతో ఉంటా’నని చెప్పుకొచ్చింది. ఇక చివరి సారిగా మీరు ఎప్పుడు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు? అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ‘మూడు రోజుల కిందట ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ చూసి కన్నీళ్లు ఆగలేద’ని చెప్పింది.