పోలవరం అప్డేట్ : చంద్రబాబు తప్పిదాలను సరిచేసుకుంటూ సాగుతున్న జగన్

మా హాయాంలో పోలవరం పనులు పరుగులుపెట్టాయి,ప్రతి సోమవారం పోలవరం అంటూ మా చంద్రబాబు ఇంజనీర్లను పరుగులు పెట్టించాడు అంటూ డప్పులు కొట్టుకోవడమే కాదు జనాలను సైతం బస్సుల్లో తరలించి భజనలు కూడా చేయించుకున్నారు నాటి పాలకులు.అదిగో పోలవరం పూర్తి చేసేస్తున్నామంటూ జనాలకు గ్రాఫిక్స్ చూపిస్తే వాళ్ళు మాత్రం పచ్చబ్యాచ్ కి త్రీడి సినిమానే చూపించారు.
రెండేళ్ళ క్రితం వరకు ప్రాజెక్టు మన తరంలో పూర్తవుతుందా అంటూ చూసొచ్చినోళ్ళందరూ నోరెళ్ళబెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రుల జీవనాడిని పూర్తి చేయడమే లక్ష్యంగా రివర్స్ టెండరింగ్ కి వెళ్ళి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లను ఆదా చేయడమే కాదు,పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్దకు అప్పగించి వేగం పెంచింది.
గతంలోలాగా సోమవారం పోలవరం లేదు,హంగూ ఆర్భాటమూ,లేదు,జనాలను బస్సుల్లో తరలించి అదిగో పోలవరం కట్టేస్తున్నాము అంటూ భజన కార్యక్రమాలు లేవు,అంతా చేతల్లోనే చూపిస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.గోదావరి పరవళ్ళుకు పోటీగా పనులు జరుగుతున్నాయా అనే చందాన పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి.వేలాది మంది ఇంజనీర్లు పర్యవేక్షణలో,ఆధునిక యంత్రసామాగ్రితో వేలాది మంది కార్మికులు రేయింభవళ్ళూ శ్రమిస్తూ ప్రపంచ అద్భుత నిర్మాణానికి ఓరూపు తీసుకొచ్చారు.
గతప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఎప్పిటికప్పుడు ఇంజనీర్లకు దిశానిర్దేశం చేసుకుంటూ పోలవరం పనులు అనుకున్నసమయానికి పూర్తిచేసేలా పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంది ఎపి ప్రభుత్వం.జలవనరుల శాఖ అధికారులు,మేఘా ఇంజనీరింగ్ సంస్ద సహకారంతో ఆంధ్రుల జీవనాడి కల సాకారం కాబోతుంది.ఓవైపు కరోనా వంటి విపత్కర పరిస్దితులు,మరో వైపు ఉరకలేస్తూ వచ్చే గోదావరి వరదలను సైతం లెక్క చేయకుండా రికార్డు స్దాయిలో పనులు పూర్తి చేసుకుంటూ ఆంధ్రుల ఆశలకు జీవం పోస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
రికార్డ్ స్థాయిలో మేఘా పనులు
పోలవరం ప్రాజెక్ట్ లో అంచనాలకు మించి పనులు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో అంటే ఏప్రిల్ 2020 నుంచి 21 మార్చి వరకు 12 నెలల కాలంలో 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని ప్రభుత్వం ప్రతిపాదిస్తే మేఘా ఇంజనీరింగ్ 5,58,073 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని చేసి తన సత్తాను చాటి చూపించింది. ముఖ్యంగా గత ఏడాది మే, జూన్, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయే విధంగా కాంక్రీట్ పని జరిగింది.
గత సంవత్సరంలో మే నెలలో కరోనాను తట్టుకొని 53 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 85,300 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. అలాగే జూన్-2020లో 70 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రికార్డు స్థాయిలో 1,20,100 క్యూబిక్ మీటర్ల పూర్తి చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 2021లో 47 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని టార్గెట్ పెట్టుకుని 83 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేసింది. ఇక ఈ ఏడాది మార్చి నెలలో 68,600 క్యూబిక్ మీటర్ల లక్ష్యం పెట్టుకోగా 81,200 క్యూబిక్ మీటర్ల పనులు చేస్తూ అబ్బురపరుస్తోంది. ఇలా ప్రతి నెలా అంచనాలను మించి కాంక్రీట్ పనులు చేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్ సాగుతోంది.
కాంక్రీట్ పని క్యూబిక్ మీటర్లలో
నెల జరిగిన పని పని లక్ష్యం
ఏప్రిల్-20 36783 36783
మే-20 85300 53263
జూన్-20 120100 72215
జులై-20 20800 27798
ఆగష్టు-20 14500 6148
సెప్టెంబర్-20 14670 6444
అక్టోబర్-20 20058 17607
నవంబర్-20 25997 15691
డిసెంబర్-20 19000 23036
జనవరి-21 36705 28513
ఫిబ్రవరి-21 82956 47047
మార్చి-21 81204 68615
మొత్తం 558073 403160

పూర్తి కావచ్చిన స్పిల్ వే పనులు
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తి అవ్వడంతో ప్రాజెక్టు ఓ రూపు దాల్చింది. కాంక్రీట్ పనులు, గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు మేఘా ఇంజనీరింగ్ ప్రణాళికతో ఇప్పటి వరకు స్పిల్ వేలో 2,82,276 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసింది. ఇక స్పిల్ వే బ్రిడ్జికి ఏర్పాటు చేయాల్సిన 48 గేట్లకు గానూ 42 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. మిగతా 12 సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. అలాగే గేట్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ లకు గానూ 13 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు. వీటితో 26 గేట్లను ఒకేసారి ఎత్తవచ్చు. ఒక్కో పవర్ ప్యాక్ సాయింతో రెండు గేట్లను ఆపరేట్ చేయవచ్చు. పోలవరం స్పిల్ వేలో 10 రివర్ స్లూయిజె గేట్ల కు గానూ 10 గేట్ల అమరిక ఇప్పటికే పూర్తయ్యింది. వాటికి అమర్చాల్సిన 20 హైడ్రాలిక్ సిలిండర్ల పనులు పూర్తయ్యాయి. వీటిని ఆపరేట్ చేయడానికి అమర్చాల్సిన 10 పవర్ ప్యాక్ లకు గానూ 6 పవర్ ప్యాక్ లను ఏర్పాటు చేశారు. ఇంకా 4 పవర్ ప్యాక్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
రాత్రింబవళ్లు తేడా లేకుండా అప్రోఛ్ ఛానెల్ పనులు:
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా పక్కాప్రణాళికతో దూసుకుపోతుంది మేఘా ఇంజనీరింగ్ సంస్ద.వరదలు వచ్చేనాటికి అప్రోచ్ ఛానెల్ పనులు పూర్తి చేసేలా మట్టి తవ్వకం పనులను వేగం చేసింది. ఇప్పటి వరకు అప్రోచ్ ఛానెల్ లో 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేయడంతో పాటు దాదాపు 300 కు పైగా టిప్పర్లు, 100కు పైగా ఎక్సవేటర్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నాయి. అప్పర్ కాఫర్ డ్యాం గ్యాప్ లను మూసివేసి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నందున వచ్చే వర్షాకాలం నాటికి స్పిల్ వే నుంచి నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అందులో భాగంగా గోదావరిని సహజ ప్రవాహం నుంచి కుడి వైపునకు 6 కిలోమీటర్ల మేర మల్లించాలి. అందుకు అప్రోచ్ చానెల్ (స్పిల్ వే ఎగువన) కీలకమైనది. అప్రోచ్ ఛానెల్ పూర్తి స్థాయిలో తవ్వేందుకు ఆగ మేఘాల మీద పనులు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం లక్ష్యాన్ని 4 రెట్లు పెంచడంతో అందుకు తగిన విధంగా మేఘా యుద్ధ ప్రతిపాదికన మట్టి తవ్వకం, రవాణా పనులు చేస్తోంది.
వేగంగా స్పిల్ ఛానెల్ పనులు:
వరదలను సైతం తట్టుకొని స్పిల్ ఛానెల్ లో ఇప్పటి వరకు 2,27,900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో పాటు స్పిల్ ఛానెల్ లో దాదాపు 28,41,785 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేసింది మేఘా సంస్థ. ఇక పోలవరంలో అతి కీలకమైన 902 కొండ తవ్వకం పనులు 4,48,487 క్యూబిక్ మీటర్లు పూర్తి అయ్యాయి.
గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతూ ఎగువ కాఫర్ ఢ్యాం పనులు:
గత ప్రభుత్వం చేసిన ఇంజనీరింగ్ తప్పులను సరిదిద్దుతూ జగన్ ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యాం పనులను శరవేగంగా చేస్తోంది. ఎగువ కాఫర్ డ్యాం రీచ్-1లో డయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేయడంతో పాటు రాక్ ఫిల్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రీచ్-1 దాదాపు 35 మీటర్ల ఎత్తకు పనులు పూర్తయ్యాయి. రీచ్-2 నిర్మాణం 38మీటర్లకు పూర్తి అవ్వగా, పూర్తి స్థాయి 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు పనులు సాగుతున్నాయి. ఇక రీచ్-3లో గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే పనులు జోరందుకున్నాయి,ఇంక రీచ్-4 దాదాపు34మీటర్ల ఎత్తుకు నిర్మాణం పూర్తి అయింది. ఈ మొత్తం ఎగువ కాఫర్ డ్యాంలో ఇప్పటి వరకు 5,77,676 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు జరిగాయి.
గ్యాప్-2 ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం పనులు :
ప్రాజెక్ట్ గ్యాప్-2 లో భాగంగా ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. అదే విధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. పోలవరం జలాశయంలో స్పిల్ వే తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) కూడా కీలకమైనది. గోదావరి నది ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మిస్తారు. ఇక్కడ రాతినేల ఎక్కడో లోతుగా ఉండడం వల్ల నిర్మాణ పని పటిష్టంగా ఉండడం కోసం కేంద్ర జలసంఘం ఆధీనంలోని డిడిఆర్పి (డ్యాం డిజైన్ రివ్వ్యూ పానెల్) సూచనల మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రాథమిక పనులన్నీ చకచకా సాగుతున్నాయి.
కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోనే పోలవరం పనులు
రాష్ర్ట ప్రభుత్వం నిర్మాణ పనులు చేయిస్తున్నా పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోనే ఉంటుంది. అంగుళం పనిలో మార్పులు, చేర్పులు చేయాలన్నా కేంద్ర జలసంఘం చేయాల్సిందే. అందులో భాగంగానే జలాశయ పరిరక్షణ, సరైన ప్రయోజనాలు సాధించే దిశగా పనుల పరిమాణం గణనీయంగా పెరిగింది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్పులు, చేర్పులు చేసిన పనుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించింది. అందులో భాగంగానే దాదాపు 1656 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. ఓ వైపు లక్ష్యాన్ని అధిగమించి పాత పనులు చేస్తుడడం, మరోవైపు అవసరం మేరకు కొత్త పనులు చేపట్టడం ఇది పోలవరంలో నేటి ప్రత్యేకత.
ఐతే జగన్మోహన్ రెడ్డి వచ్చాక పోలవరం పడకేసింది,తట్టమట్టి తవ్వలేదు,బొచ్చెడు కాంక్రీట్ వేయలేదంటూ దుష్ప్రచారం చేసే పచ్చపార్టీ నాయకులు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులు చూసి లబోదిబో అంటున్నారు,అన్నుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తైపోతే ఆక్రెడిట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెళ్ళిపోతుందనే అక్కసుతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.వీరికి తోడు పచ్చ మీడియా ఎప్పటికప్పుడు లేనిపోని కధనాలు వండి వార్చుతూ తమ కడుపుమంట తీర్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here