టెక్నాలజీ రోజురోజుకూ ఎంతో పెరిగిపోతోంది. అప్పట్లో మోటార్ సైకిళ్లతో ఎక్కడికో వెళ్లే వాళ్లు.. చూస్తుండగానే కార్లు విమానాలు వచ్చేశాయి. కాగా ఇప్పుడు డ్రైవర్ లేకుండానే కార్లు నడుపుతున్నారు. తాజాగా చైనాలో డ్రైవర్ లేకుండా కార్లు నడపబోతున్నారు.
డ్రైవర్ అవసరం లేకుండా దానంతటదే నడిచే కారు.. ఎప్పటి నుంచి ప్రజలను ఊరిస్తున్న కాన్సెప్ట్ ఇది. ఈ కార్లలో పరిసరాలను గుర్తించే అత్యాధునిక సెన్సర్లు, ఎదురుగా వచ్చే ట్రాఫిక్ లేదా ఇతర అడ్డంకులను బట్టి తగు నిర్ణయాలు తీసునే కృత్రిమ మేథస్సు ఉంటాయి. ఇటువంటి కార్లలో మనం చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే అదే మనల్ని గమ్యస్థానానికి చేర్చుతుంది. కానీ..ఈ దిశగా రూపొందించిన పలు కంపెనీల నమూనా కార్లు ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్నాయి. ఇవి రోడ్లపై తిరుగాడేందుకు మరి కొన్నేళ్లు పడుతుందనే నిపుణుల మాట. అయితే ఈ విషయంలో ఓ చైనా కంపెనీ దూకుడు ప్రదర్శిస్తోంది.కార్ల పనితీరును ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల్లో నేరుగా పరీక్షించేందుకు ఆటో ఎక్స్ అనే కంపెనీకి ప్రభుత్వానుమతి లభించింది. చైనాలోని షెంజెన్ ప్రాంతంలో ఈ కార్లు పరుగులు పెట్టనున్నాయి.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..కారులో భద్రత కోసం డ్రైవర్ గానీ లేదా రిమోట్ కంట్రోల్తో నియంత్రించడం కానీ ఉండదు. పూర్తి స్వతంత్రంగా తనంతట తానుగా కారు ట్రాఫిక్లో వెళ్లనుంది. డ్రైవర్ రహిత కార్ల అభివృద్ధిలో ఇదో కీలక ముందడుగా నిపుణులు భావిస్తున్నారు. ఇటువంటి కార్లు సాధ్యమేనా అన్న ప్రశ్న సమసిపోయిందని, ఇవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనేదే ప్రస్తుతం మనముందు మిగిలున్న ప్రశ్న అని వారు చెబుతున్నారు.