ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. సామాన్యులపై ప్రభుత్వం భారం మోపుతోంది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు ఏపీలో గ్యాస్ ధరలపై వ్యాట్ ను భారీగా పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా పదిశాతం పెరిగిన వ్యాట్ తో గ్యాస్ ధరలు మండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటూ ఉదయం నుంచి పలు సామాజిక మాధ్యమాలతో పాటు టీవీ చానళ్లలో కూడా వార్తలు వచ్చాయి.
ఈ వార్తలతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే కరోనాతో పనులు లేక వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మళ్లీ గ్యాస్ ధరలు పెంచడం ఏంటని ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చింది. దీనిపై స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ స్పందించి మాట్లాడారు.
గృహావసరాలకు వాడే గ్యాస్ ధర ప్రభుత్వం పెంచలేదన్నారు. ఎల్పీజీ గ్యాస్పై వ్యాట్ పెంచామన్నది అబద్ధం. అసలు ఎల్పీజీ గ్యాస్పై ట్యాక్స్ జీఎస్టీ పరిధిలోనిది. ఎల్పీజీపై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు అవగాహన లేక తప్పుగా ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నేచురల్ గ్యాస్పై ట్యాక్స్ను స్వల్పంగా పెంచింది. అది పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే గ్యాస్ మాత్రమేనని.. వంట గ్యాస్పై ట్యాక్స్ ఎక్కడా పెంచలేదని రజత్ భార్గవ్ స్పష్టం చేశారు.






