తెలుగు చిత్రపరిశ్రమపై దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ దారుణంగా తయారైందని ఆయన అన్నారు. చిత్రపరిశ్రమ గతంలో కళ కోసం పని చేసేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చిత్రపరిశ్రమ వ్యక్తుల కోసం పని చేస్తోందని మండిపడ్డారు. తానెవర్నీ విమర్శించాలని భావించడం లేదని, అయితే చిత్రపరిశ్రమలో విధానం గురించి చెబుతున్నానని ఆయన చెప్పారు. తన సినీ కెరీర్ పై ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
భగవంతుడి దయవల్ల అన్ని రకాల పాత్రల్లో తనను ప్రేక్షకులు ఆదరించారని ఆయన తెలిపారు. విభిన్న రసాలను పండించడం వల్ల నవరసనటసార్వభౌమ బిరుదు ఇచ్చారని ఆయన అన్నారు. టీడీపీని స్ధాపించిన వారిలో తాను కూడా ఒకడినని ఆయన చెప్పారు. అన్న ఎన్టీఆర్ తనను సొంత తమ్ముడికంటే ఎక్కువగా ఆదరించారని ఆయన తెలిపారు. అయితే టీడీపీ సొంత వారిని మర్చిపోయిందని ఆయన అన్నారు. అప్పుడు పీక్ లో ఉండే నటుడికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉండే దని, ఇప్పుడు కోట్లలో ఉందని ఆయన చెప్పారు.