నెలల తరబడి మిర్చి రైతులు పడుతున్న వెతలపై రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్.. ఇటీవల గుంటూరులో రెండు రోజుల పాటు రైతుదీక్ష చేసిన సంగతి తెలిసిందే.
గత ఏడాది క్వింటాలు మిర్చి రూ.11 వేల నుంచి రూ.15వేల మధ్యనున్న మిర్చి ధర ఈసారి దారుణంగా క్వింటాలు రూ.2వేల నుంచి రూ.4వేలకు పడిపోవటం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్న విషయాన్ని అర్థమయ్యేలా చేయటంఒలో విపక్ష నేత జగన్ కీలక భూమికపోషించారని చెప్పాలి.
కొద్దిరోజుల కిందట మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పిన జగన్.. తాజాగా సోమ.. మంగళవారాలు తన దీక్షతో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయన దీక్ష పుణ్యమా అని ఇంతకాలం ఈ ఇష్యూ మీద కామ్ గా ఉన్న కేంద్రం తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. పంట గిట్టుబాటు విషయంలో తాజాగా హామీ ఇచ్చింది. క్వింటాలు మిర్చికి రూ.5వేల మద్దతు ధరను ప్రకటించిన కేంద్రం.. ఓవర్ హెడ్ చార్జిస్ కింద రూ.1250 అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. పంటను రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీలోని 88,300మెట్రిక్ టన్నులు.. తెలంగాణలోని 33,700 టన్నుల మిర్చిని కేంద్రం కొనుగోలు చేయనుంది. మే 2 నుంచి 31 వరకూ మిర్చిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో.. రైతులకు ఎంతోకొంత మేలు జరగనుంది. మొత్తానికి బాబు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ జగన్ చేపట్టిన రైతుదీక్ష కేంద్రాన్ని కదిలించటంపై రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.