ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట.. మూడు రాజధానుల అంశం మళ్లీ తెరపైకి రావడం. అంటే ఈ విషయం కొన్ని నెలల నుంచి బలంగా వినిపిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు బిల్లులను అడ్డుకోవడం, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రాజధాని మార్పు గురించి అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు గవర్నర్ బిల్లులకు ఆమోద ముద్ర వేయడంతో మళ్లీ చర్చ మొదలైంది.
వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో అమరావతి రాజధాని అంటూ టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకించి మూడు రాజధానులు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏం చేస్తే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళుతుందో ఆయన ఆలోచించారు.
బహుళ రాజధానులు ఉంటేనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఇది బోస్టన్ కమిటీ చెప్పిన మాట. రాష్ట్రంలో అమరావతి ఒక్కటే రాజధాని అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో కూరుకుపోతుందని కమిటీ నివేదికను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అమరావతిలోనే రాజధాని ఉండాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల లక్ష కోట్లరూపాయలకు పైగా ఖర్చు పెట్టాలి.. ఇందులో 95శాతం అప్పు రూపంలో తీసుకుంటే ఇక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రశ్నార్థకమవుతుందని కమిటీ తెలిపింది.
అంతకుముందు జీఎన్రావు కమిటీ కూడా దీనిపై స్పష్టమైన నివేదిక ఇచ్చింది. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. అమరావతి ఎలాగూ రాజధానిగా ఉంటుందని.. ఇతర ప్రాంతాలలో ఉన్న అవకాశలను అందిపుచ్చుకొని అభివృద్ధి చేయాలని తెలిపింది. అంతకంటే ముందే శివరామకృష్ణన్ కమిటీ కూడా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పాలనా వ్యవస్థను వికేంద్రీకరించాలని తెలిపింది.
ఈ కమిటీల అధ్యయనాలను పరిశీలించిన వై.ఎస్ జగన్ సర్కార్ భావి తరాల కోసం రాష్ట్ర అభివృద్ధి ఒక్కటే ముఖ్యమని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు వైఎస్ జగన్ మూడు రాజధానులంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలుతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో జగన్ ఇలా ముందుకు వెళుతున్నారు. అందుకే ఇప్పుడు కేవలం ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే గ్రామ సచివాలయాలు (విలేజ్ సెక్రటేరియేట్)లు ఏర్పాటు చేసిన జగన్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ తో ఎలా ముందుకు వెళ్లనున్నారో వేచి చూడాలి.