జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి మాట్లాడిన పవన్ రాజకీయ పార్టీల వైఖరిపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడిన స్పీచ్ కింది స్థాయి కార్యకర్తలతో పాటు నాయకుల్లో కూడా ఆత్మస్థైర్యం నింపిందని టాక్ నడుస్తోంది. ఇంతకీ పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారంటే..
పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తూ ఉంటారని, అమరావతి విషయంలో అదే జరిగిందని పవన్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో క్రియాశీల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ విభజించి పాలించే విధానంతో పాలకులు వెళ్తున్నారని, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమని పవన్ స్పష్టం చేశారు. అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రజలు కోల్పోయిన వాటిని అందజేయడమేనని, అది జనసేన చేస్తుందన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా.. పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని విమర్శించారు. తనకు పారిపోవడం తెలియదని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని.. అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెబుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ సమావేశంలో ఐదు జిల్లాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా అవసరమైన సమయంలో తమ పార్టీ వెంటనే స్పందిస్తుందనే మెసేజ్ను పవన్ మరోసారి స్పష్టం చేసినట్లు అర్థం చేసుకోవచ్చు.