ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. సామాన్యులకే కాకుండా ప్రముఖులను కూడా బెదిరింపులు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చేరిపోయారు. ఎవ్వరినీ లెక్కచేయకుండా ఏకంగా ముఖ్యమంత్రినే బెదిరించేసి ఓ వ్యక్తి దొరికిపోయాడు.
ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. దక్షిణ గోవాలోని సాంకోలే గ్రామవాసి ఆశిష్ నాయక్ ఇంటర్నేషనల్ ఫోన్ నంబరు నుంచి సీఎం ప్రమోద్ సావంత్ ను దూషిస్తూ, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ మెసేజులు పంపించాడు. దీనిపై సీఎం ప్రమోద్ సావంత్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను బెదిరిస్తూ సందేశాలు పంపిన యువకుడిని గోవా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఆశిష్ నాయక్ సీఎంతోపాటు పలువురు ప్రముఖులను బెదిరిస్తూ సందేశాలు పంపించాడని, వారి నుంచి డబ్బు డిమాండు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
వ్యక్తిగత శత్రువు అయిన వ్యక్తి నంబరు నుంచి సీఎంను బెదిరించాడని పోలీసులు చెప్పారు. అయితే ఇలాంటి ఘటనలు దేశంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో ఓ రాష్ట్ర మంత్రి పీఏను సైతం ఓ వ్యక్తి అపహరించారు. ప్రముఖులకే ఇలా జరిగితే ఇక మా పరిస్థితి ఏంటన్న ఆలోచన సామాన్యుల్లో తలెత్తుతోంది. అయితే కొందరు కావాలనే ఇలా పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారని పలువురు చెబుతున్నారు.