బిజెపి నేత ఎల్.కే అద్వానీని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో ఆయన విచారణ ఎదుర్కొన్నారు.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చేందుకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపడుతోంది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది తమ వాదనలు వినిపించవచ్చని న్యాయమూర్తి ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు మురళి మనోహర్ జోషి వాంగ్మూలం కూడా నమోదు చేసింది. ఇప్పుడు అద్వానీ వాంగ్మూలం సేకరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణ సాగినట్లు తెలుస్తోంది. అద్వానీ తనపై ఉన్న ఆరోపణలు ఖండించినట్లు ఆయన తరుపు లాయర్ తెలిపారు.