కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్తో వందలాది మంది వలస కార్మికుల్ని సొంతగూటికి చేర్చారు సోనూ సూద్. కానీ అప్పటితో తన పని ఇంకా పూర్తి కాలేదంటున్నారు.కరోనా సమయంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన సాయం ఎవరూ మరిచిపోలేరు. మరీ ముఖ్యంగా వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిగా నిలిచి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు సోనూ సూద్. లాక్డౌన్ సమయంలో ఆయన చేసిన సామాజిక సేవలు వెలకట్టలేనివి. వైద్యుల కోసం హోటల్ కేటాయించిన సోనూ సూద్, వలస కార్మికులని వారి సొంత గ్రామాలకి తరలించేందుకు బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసాడు. సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరిని వారి గూటికి చేర్చడంపై సోనూ సూద్ చేసిన సేవకు దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.మరికొందరు అయితే ఆయనకు వీరాభిమానులుగా మారిపోయారు అయితే ఇప్పటికీ తన తన బాధ్యత ఇంకా పూర్తి కాలేదంటున్నారు సోనూ సూద్.
లాక్ డౌన్ సమయంలో వివిధ ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడ్డ వలన కార్మికుల కుటుంబాలకి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు సోనూ సూద్. ఆయన సేవలని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.