ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడటం తెలుగుదేశం పార్టీకి ఎంత మాత్రం నచ్చడం లేదన్న చర్చ ఈ మధ్య ఎక్కువవుతోంది. ఎందుకంటే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే టిడిపి కంటే బీజేపీ నేతలు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో టిడిపి టార్గెట్ బీజేపీ అన్నట్లు ఉందని వినికిడి.
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాలు పూర్తిగా తారుమారయ్యాయి. ప్రతిపక్ష స్థానంలో టిడిపి ఉండటం చంద్రబాబుకు ఏం నచ్చడం లేదు. కానీ అధికార పార్టీని ఢీకొట్టే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో సౌత్లో బలపడేందుకు వచ్చిన బీజేపీపై టిడిపి కన్ను పడింది. ఎలాగైన ఆ పార్టీ కంటే బలమైన పార్టీ అనిపించుకోవాలని టిడిపి అధినాయకత్వం ఆలోచనలో పడినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పలు వాట్సాప్ గ్రూప్లపై జరుగుతున్న చర్చ ఇందుకు అనుకూలంగా కనిపిస్తోంది.
బీజేపీకి నష్టం చేకూర్చేలా మిషన్ ఆంధ్రప్రదేశ్ అనే వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెడుతున్నారని బీజేపీ నేతలు టిడిపిపై విజయవాడ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి వ్యతిరే్కంగా ప్రచారాలు చేస్తున్నారని వివరించారు. దీన్ని బట్టి చూస్తే ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీని టార్గెట్ చెయ్యకపోతే ఎందుకు టిడిపి నేతలు పోస్టులు పెడతారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ప్రధానంగా ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు క్లియర్గా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించి చాకచక్యంగా వ్యవహరించింది. టిడిపి నుంచి బీజేపీలో చేరిన పలువురు నాయకులు సోము నాయకత్వం పట్ల అయిష్టంగా ఉన్నారు. అయితే వీరంతా ఎక్కడో ఒక చోట టిడిపికి లాభం చేకూర్చేవారే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సోము వచ్చాక వీరి ఆటలు సాగడం లేదని అధిష్టానం ఎలా చెబితే అదే దారిలోనే ఆయన వెళ్తున్నారని టాక్. దీంతో టిడిపి శిబిరంలో గుబులు మొదలై ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంట. మరి ఇదంతా చూస్తున్న వారు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందనడానికి టిడిపి భయమే కారణమని చెప్పుకుంటున్నారు.