విశాఖ ఎల్జీ పాలిమర్స్ సీఈవో సహా 12 మంది అరెస్ట్..

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సంచలనం చోటుచేసుకుంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తుది నివేదికను సమర్పించిన మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్ రావుతో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తుది నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి అనేక కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ 4,000 పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ చైర్మన్‌ నీరబ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్‌ లీకేజీ మాత్రమే కాదని స్టైరిన్‌ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయమని, అయితే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ఈ విషయంలో తీవ్ర తప్పిదం చేసిందని వెల్లడించారు. 2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేషన్‌ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు.

విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7వ తేదీన వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారాంత ప్రభుత్వ సహాయంతో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here