తెలుగు సినీ అభిమానులకు కూడా బాగా చేరువైన కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేశారు. బెంగళూరులో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ పేరు ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ’ అని ఆయన తెలిపారు. పార్టీ లోగోను కూడా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని గాంధీభవన్ వేదికైంది.
పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం, పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా ఉపేంద్ర పేర్కొన్నారు. ఇది తన పార్టీ కాదని, ప్రజల పార్టీ అని తెలిపారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని… తన లక్ష్యాలతో ఏకీభవించేవారంతా పార్టీలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. సమాజంలో మార్పును తీసుకురావడమే తన కల అని చెప్పారు.
రైతుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని… దాన్ని అంతం చేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు. సాధారణ జనాలని ఉపేంద్ర కలుపుకుని పోయే తీరు చూస్తుంటే ఆయన పంథా కూడా పవన్ కళ్యాణ్ జనసేన లాగానే అనిపిస్త్తోంది.